శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (07:08 IST)

సముద్రమార్గంలో 400 కోట్ల దొంగనోట్లు: రూ.2వేల నోట్లంటనే వణుకుతున్న జనం

ఒకటా రెండా.. మూడా.. నాలుగు వందల కోట్ల రూపాయల దొంగనోట్లు కంటైనర్ల ద్వారా చెన్నై హార్బర్‌కు చేరిన సమాచారం ఉత్కంఠను రేపుతోంది. ఈ సమాచారంతో వందలాదిగా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడి లారీలు అక్కడే ఆగడంతో హార్బర్‌ తీరం వెంబడి కంటైనర్‌ లారీలు బారు

ఒకటా రెండా.. మూడా.. నాలుగు వందల కోట్ల రూపాయల దొంగనోట్లు కంటైనర్ల ద్వారా చెన్నై హార్బర్‌కు చేరిన సమాచారం ఉత్కంఠను రేపుతోంది. ఈ సమాచారంతో వందలాదిగా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడి లారీలు అక్కడే ఆగడంతో హార్బర్‌ తీరం వెంబడి కంటైనర్‌ లారీలు బారులు తీరాయి. ఈ తనిఖీలు పుణ్యమా ఎగుమతి దిగుమతులకు ఆటంకాలు నెలకొనడంతో వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి సముద్ర మార్గంలో రూ. రెండు వేల దొంగనోట్లను భారత్‌లోకి పంపించేందుకు ముష్కరులు ప్రయత్నాలు చేసి ఉండడం నిఘా వర్గాల దృష్టికి చేరింది. తమకు అందిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు దేశంలోని అన్ని హార్బర్‌లలో అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా చెన్నై హార్బర్‌లో రెండు రోజులుగా చడీ చప్పుడు కాకుండా కంటైనర్లలో తనిఖీల మీద కస్టమ్స్‌ వర్గాలు దృష్టి పెట్టాయి.
 
కోట్లాది రూపాయలు కంటైనర్లలో వచ్చి చేరినట్టుగా సమాచారం బయటకు పొక్కడంతో ఉత్కంఠ తప్పలేదు. తొలుత పదుల సంఖ్యలో అధికారులు తనిఖీల్లో నిమగ్నం కాగా, ఆదివారం వందలాదిగా ఉరుకులు, పరుగులతో ఆ కంటైనర్లు చెన్నైకు వచ్చాయా అని తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలతో అనేక నౌకలు హార్బర్‌ తీరానికి కూత వేటు దూరంలో ఎగుమతి, దిగుమతుల నిమిత్తం వేచి ఉండాల్సిన పరిస్థితి. 
 
అలాగే, హార్బర్‌కు వివిధ ప్రాంతాల నుంచి సరకు లోడుతో వచ్చిన కంటైనర్‌ లారీలు, ఇక్కడ దిగుమతి అయ్యే వస్తువుల్ని బయలకు తీసుకెళ్లేందుకు వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. హార్బర్‌ తీరం వెంబడి  ఈ వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు.
 
చెన్నై హార్బర్‌లో రెండు స్కానర్లు మాత్రమే ఉండడంతో, అన్ని కంటైనర్లను త్వరితగతిన తనిఖీలు చేసి బయటకు పంపడం అన్నది శ్రమతో కూడుకున్న పనిగా మారి ఉన్నది. హార్బర్‌లో పది వేల కంటైనర్ల ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, ఎగుమతి, దిగుమతుల్లో జాప్యం నెలకొనే కొద్ది వర్తకుల్లో ఆందోళన బయలు దేరింది. కొన్ని రకాల వస్తువులు త్వరితగతిన పాడై పోయేవి ఉండడంతో, వాటిని త్వరితగతిన బయటకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని హార్బర్‌ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
ఈ తనిఖీల కారణంగా ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో, ఆగమేఘాలపై కస్టమ్స్‌ వర్గాలు చర్యల్ని వేగవంతం చేశాయి. హార్బర్, కస్టమ్స్‌ , ప్రత్యేక బృందాలు సమన్వయంగా వ్యవహరిస్తూ, తనిఖీలను వేగవంతం చేస్తున్నారు. తనిఖీలు పూర్తి చేసిన కంటైనర్లను జీరో గేట్‌ ద్వారా బయటకు పంపిస్తున్నారు. 
 
రూ.400 కోట్ల మేరకు దొంగ నోట్లు ఇక్కడ చెలామణి చేయడానికి ముష్కరులు వ్యూహ రచన చేసినట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో రూ. 2వేల నోటు తమకు వద్దు బాబోయ్‌ అని భయంతో పరుగులు పెట్టే వారి సంఖ్య ఇక పెరిగినట్టే. అలాగే ఈ నోట్లు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల పంపిణీకి వచ్చి ఉండొచ్చేమో అన్న ప్రచారం తెరమీదకు రావడం గమనార్హం.