శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (13:23 IST)

మహిళలకు భారత్ సురక్షితమే!: మహిళా కానిస్టేబుల్ అదుర్స్!!

ప్రపంచ దేశాలతో పోల్చితే, భారత్ ఎప్పటికీ మహిళలకు సురక్షితమైనదేనని లక్నోకు చెందిన ఈషా గుప్తా ప్రచారం చేస్తున్నారు. ఈ నినాదాన్ని దేశవ్యాప్తంగా వినిపించేందుకు ఆమె ఏకంగా ఓ బృహత్కార్యాన్నే చేపట్టారు. 
 
దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి, ఆయా నగరాల్లో తన వాణిని వినిపించేందుకు బైక్‌పై బయలుదేరారు. దాదాపు 6 వేల కిలో మీటర్ల మేర తన ప్రయాణాన్ని సాగిస్తూ భారత ప్రధాన నగరాల్లోని మహిళలను కలుస్తున్నారు. 
 
ఆదివారం ఆమె ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎదగనున్న విజయవాడను సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలోని మహిళలతో ఆమె మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్ ఎప్పటికీ సురక్షితమైనదేనని ఈషా గుప్తా, పునరుద్ఘాటించారు.
 
ఇదేవిధంగా లక్నో మహిళా కానిస్టేబుల్ భలే అనిపించింది. యూపీలో మహిళా కానిస్టేబుల్ తన డ్యూటీని సమర్థవంతంగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలను ఇక ఎంతమాత్రం సహించేది లేదని లక్నో మహిళా పోలీస్ కానిస్టేబుల్ సునీత చెబుతోంది.
 
23 ఏళ్ల సునీత, మృగాళ్ల బారి నుంచి ఓ యువతిని రక్షించారు. అదీ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత. సునీత అరెస్ట్ చేసిన వారిలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నాడు. 
 
గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి బయలుదేరిన సునీత, ఓ టీనేజ్ బాలికను బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వేధిస్తుండటం చూశారు. అడ్డుకుందామంటే సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. తాను పనిచేసే మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. వెనువెంటనే అక్కడికి అతి సమీపంలోని మహా నగర్ పోలీస్ స్టేషన్‌కూ సమాచారమిచ్చారు. అయితే వారొచ్చేలోగానే పరిస్థితి విషమించేలానే ఉంది. 
 
అంతే, ఒక్కసారిగా అపరకాళిక అవతారం ఎత్తారు. నేరుగా నిందితులు కూర్చున్న బైక్ వద్దకెళ్లి బైక్ తాళాలు లాగేసే యత్నం చేశారు. దీంతో నిందితులు ఆమెపై దాడికి యత్నించారు. వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన సునీత, నిందితుల్లో ఇద్దరిపై ముష్టి ఘాతాలు కురిపించారు. వారి కాలర్లు పట్టేసి నిలువరించేశారు. ఈలోగా మూడో నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. ఆలోగా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దూబే, సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు. నిందితులిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. 
 
పట్టుబడిన నిందితుల్లో ఒకరిని రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో ఎస్సై‌గా పనిచేస్తున్న దినేశ్ సింగ్ బిస్త్‌గా గుర్తించారు. తాగిన మైకంలో స్నేహితులతో కలిసి అతడు టీనేజ్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడిపై కేసు నమోదు చేయరాదని ఉన్నత స్థాయి నుంచి మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. 
 
అయితే తన స్టేషన్‌లో పనిచేస్తున్న సునీత, అత్యంత ధైర్యసాహసాలతో పట్టుకున్న నిందితులను వదిలిపెట్టేది లేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దూబే కేసు నమోదు చేశారు. నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సునీతను అభినందించారు. పదోన్నతితో పాటు రాష్ట్రపతి గ్యాలెంట్రీ మెడల్‌కు సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.