మధ్యప్రదేశ్ రైలు ప్రమాదాల్లో 20 మంది మృతి... ప్రమాదం ఎలా జరిగింది.?
మధ్యప్రదేశ్లో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 20 మంది మరణించారు. మాచక్ నదిలో కామయాని ఎక్స్ప్రెస్ 10 బోగీలు పడ్డాయి. కామాయని, జనతా ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడం వల్ల 20 మంది మరణించారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి.
భారీవర్షాలకు మాచక్ నది దాటాక ఉన్న కల్వర్టుపై రెండు ట్రాక్లు కుంగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కల్వర్టుమీద రెండువైపులా ఉప్పొంగుతున్న నీరు పట్టాలు తప్పిన బోగీల్లోకి చేరడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు.
ప్రయాణికుల్లో చాలామందిని రక్షించి, ఇటార్సీ రైల్వేస్టేషనుకు తరలించామని రైల్వేఅధికారులు వివరించారు. ఈ సంఘటనలో 300 మంది ప్రయాణికులను స్థానికులు కాపాడారు. హర్దాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
మరో సంఘటనలో సమాచారలోపంతో అదేమార్గంలో వెనుకే వచ్చిన జనతా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. జబల్పూర్ నుంచి ముంబయి వెళుతున్న జనతా ఎక్స్ప్రెస్ ఖిర్కియా- బిరంగి రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది.