బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (13:49 IST)

శశికళ వర్గమే టాప్.. చిన్నమ్మకే సీఎం పగ్గాలు.. పన్నీర్ బూడిదలో పోసిన ''తన్నీరే"నా?

తమిళ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఉత్కంఠభరితంగా సాగే ట్వంటీ-20 మ్యాచ్‌ను తలపిస్తున్నాయి. అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమని పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించారు

తమిళ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఉత్కంఠభరితంగా  సాగే ట్వంటీ-20 మ్యాచ్‌ను తలపిస్తున్నాయి.  అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమని పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించారు. అయితే పన్నీర్ వెంట ముగ్గురంటే ముగ్గురే ఉంటే.. చిన్మమ్మ వెంట చాలామంది ఎమ్మెల్యేలు వెంట వున్నారు.

కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారనే విషయాన్ని పన్నీర్ చెప్పలేకపోయారు. శశికళ మాత్రం మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం శశికళకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
బుధవారం జరిగిన సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరైన 123 మంది ఎమ్మెల్యేలు శశికళకు మద్దతు ఇస్తారని చెప్పలేమని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకవేళ ఈ 123 మంది మద్దతిస్తే మాత్రం పన్నీరు సెల్వంకు గడ్డు కాలమనే చెప్పాలి. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలంతా పన్నీరుకు మద్దతిస్తే మళ్లీ సీన్ రివర్సవుతుంది. ఈ వ్యవహారం మొత్తం మీద డీఎంకే ఎమ్మెల్యేల మద్దతే కీలకం కానుంది. 
 
స్టాలిన్ కూడా పన్నీరు సెల్వం వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం తమిళనాడు అసెంబ్లీ సీట్లు 234. ఇందులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 135 మంది. డీఎంకే ఎమ్మెల్యేలు 89. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. 8. ఐయూఎమ్‌ఎల్ 1. జయలలిత మరణంతో ఆర్‌కే నగర్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ.

ఇవీ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో పార్టీల బలాబలాలు. ఈ లెక్కల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శశికళ వర్గానికి గానీ, పన్నీరు వర్గానికి గానీ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ 118 ఎమ్మెల్యేలు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేదాని పైనే తమిళనాడు సీఎం ఎవరనే విషయం తేలనుంది.
 
ఇకపోతే.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలుగా ఇప్పుడు ఆ పార్టీ విడిపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే.. బుధవారం ఉదయం పన్నీరు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు మైత్రేయన్, పాండియన్, పొన్నుస్వామి అక్కడికి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. 
 
అంతేగాక, శశికళపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శశికళది ఓ దోపిడీ బృందమని ఎంపీలు మైత్రేయన్, పాండియన్ ఆరోపించారు. రెండు గంటలపాటు నిర్బంధించి బలవంతంగా సెల్వంతో రాజీనామా చేయించారని శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్వంకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఎంపీలు చెప్పారు. డబ్బు, అధికారం కోసమే శశికళ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.