గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (14:12 IST)

బెగ్గర్లం కాదు.. ప్రతిపక్ష హోదా అడుక్కోవడానికి : వీరప్ప మొయిలీ

లోక్‌సభలో ప్రతిపక్ష హోదా అడుక్కునేందుకు మేం భిక్షగాళ్ళం కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం తామేమీ అడుక్కోవడం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించిన సవరణపై చర్చ జరిగిన సందర్భంగా మొయిలీ ఈ మేరకు స్పందించారు. 
 
ప్రజాస్వామ్యంలో విధానాలను పాటించాలని, ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా నియంతృత్వ ధోరణితో ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సుదీర్ఘ కాలం పాటు మాటల యుద్ధం కొనసాగింది. 
 
సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం సభ్యులున్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చిన నరేంద్ర మోడీ సర్కారు 44 సీట్లున్న కాంగ్రెస్‌కు ఆ పదవిని ఇచ్చేందుకు నిరాకరించింది. పైగా, గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాన్నే ఇపుడు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కూడా అనుసరిస్తున్నట్టు వివరణ కూడా ఇచ్చింది.