యూపీలో సీఎం యోగి ఎఫెక్ట్ : మాంసం దుకాణాలు బంద్.. కూరగాయలకు డిమాండ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ప్రభుత్వం అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు. ఈ చర్యను నిరసిస్తూ లక్నోలో మాంసం వ్యాపారులు దుకాణాలు మూసేసి నిరవధిక సమ్మెకు దిగారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ప్రభుత్వం అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు. ఈ చర్యను నిరసిస్తూ లక్నోలో మాంసం వ్యాపారులు దుకాణాలు మూసేసి నిరవధిక సమ్మెకు దిగారు. వీరికి చికెన్, మటన్ దుకాణదారులు కూడా జతకలిసి దుకాణాలు బంద్ చేశారు. దీంతో లక్నోలో మాంసం దొరక్క ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరూ కూరగాయల కోసం ఎగబడ్డారు.
అంతేకాకుండా, సోమవారం నుంచి తమ పోరును మరింత ఉధృతం చేస్తామని లక్నో బక్రా గోస్ట్ వ్యాపార్ మండల్కు చెందిన ఖరేషి హెచ్చరించారు. బీఫ్ కొరతతో చికెన్, మటన్కు మారిన టండీ, రహీమ్ నగరాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది. ప్రముఖ దుకాణాలన్నీ మూతపడ్డాయి.
సీఎం ఆదేశాల మేరకు... షామ్లీ జిల్లా కైరానాలో అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ ప్లాంటు ‘మీమ్ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను మూసివేశారు. జలాలాబాద్, షామ్లీ పట్టణాల్లోనూ లైసెన్సులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తున్న పలు మాంసం దుకాణాలను బంద్ చేయించారు.
ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ కబేళాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వాటిని మూసివేయించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాంసం వ్యాపారులు ఆందోళనకు దిగారు. దుకాణాలను మూసివేశారు.