శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (11:57 IST)

నిన్నటివరకు న్యాయవాది.. నేడు న్యాయమూర్తి.. వెంకయ్య తెలుగు స్పీచ్ ఓ ఎక్స్‌ప్రెస్ : మోడీ

రాజ్యసభలో నిన్నటివరకు వివిధ సమస్యలపై ఓ న్యాయవాదిగా వాదించి, వాదాడిన వెంకయ్య నాయుడు ఇపుడు న్యాయమూర్తి స్థానంలో (రాజ్యసభ ఛైర్మన్) కూర్చొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

రాజ్యసభలో నిన్నటివరకు వివిధ సమస్యలపై ఓ న్యాయవాదిగా వాదించి, వాదాడిన వెంకయ్య నాయుడు ఇపుడు న్యాయమూర్తి స్థానంలో (రాజ్యసభ ఛైర్మన్) కూర్చొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, సభా కార్యక్రమాలను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా వెంకయ్యకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అయ్యారని మోడీ కొనియాడారు. వెంకయ్య నాయుడుకు రాజ్యసభ  కార్యకలాపాల గురించి సంపూర్ణంగా తెలుసునని, అటువంటి నేత ఉపరాష్ట్రపతి కావడం సంతోషమన్నారు. 
 
వెంకయ్య నాయుడు తెలుగులో మాట్లాడితే సూపర్‌ఫాస్ట్‌గా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాట్లాడగలరని ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో సమస్యలను ఆయన బాగా అర్థం చేసుకోగలరన్నారు. రైతుల కష్టాల గురించి ఆయనకు బాగా తెలుసునన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేశారని, ప్రధానమంత్రి సడక్ యోజనను ఆయనే రూపొందించారన్నారు. న్యాయవాది మాదిరిగా ఇప్పటి వరకు మనతో కలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఆసీనులయ్యారన్నారు.
 
విద్యార్థి దశలో జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు సుపరిపాలన కోసం పోరాడారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి నేతగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, విధాన సభ, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలమైనదన్నారు. నేటి భారతదేశంలో గ్రామీణ, పేద, అణగారిన వర్గాలవారు ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య పరిణతిని తెలియజేస్తోందని, భారతీయులందరికీ గర్వకారణమని చెప్పారు. ఇదంతా మన పూర్వీకుల గొప్పదనమన్నారు.