బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (06:01 IST)

ఏడీఎంకే సభ్యత్వం లేనివారు కేసు వేసే అర్హత లేదు... శశికళకు కోర్టులో చుక్కెదురు

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ (చిన్నమ్మ) అర్హురాలు కాదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ (చిన్నమ్మ) అర్హురాలు కాదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. 
 
శశికళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రిసైడింగ్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, శశికళ పుష్పా పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చాయి. ఈ మేరకు జస్టిస్‌ కల్యాణ సుందరం నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా తీర్పు వెలువరించింది. 
 
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలంటే కనీసం ఐదేళ్ల పాటు పార్టీ సభ్యులుగా ఉండాలని, శశికళ పార్టీ సభ్యురాలు కాదని శశికళ పుష్పా తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల పార్టీ ఉన్నత పదవికి ఆమె అర్హురాలు కాదంటూ భర్త లింగేశ్వర తిలగన్‌తో కలిసి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీనికి ప్రతిగా పార్టీ ప్రిసైడింగ్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ సభ్యురాలు కాని పుష్పకు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని, ఆమె పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన అనంతరం న్యాయస్థానం శశికళ పుష్ప పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
కాగా, డిసెంబర్ 31వ తేదీన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. ఈ పదవికి ఆమెను ఏడీఎంకే నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.