ఆమీర్ ఖాన్ వ్యాఖ్యాల్లో ఎలాంటి తప్పు లేదు : మద్రాస్ హైకోర్టు జస్టీస్
మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి డి.హరిపరంథామన్ అభిప్రాయపడ్డారు. ఆమీర్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చతో పాటు వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఆమీర్కు వ్యతిరేకంగా, అనుకూలంగా స్పందనలు వస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో.. జస్టీస్ హరిపరంథామన్ స్పందిస్తూ.. ఆమీర్ఖాన్ తన భార్యతో జరిపిన సంభాషణను బయటకు వెల్లడించడంలో తప్పు లేదని అన్నారు. చెన్నైలో అడ్వకేట్స్ ఫోరం నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో పెరిగిపోతున్న అసహనం నేపథ్యంలో ఆమీర్ భార్య తన కుమారుడి భద్రత కోసం దేశం విడిచి వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, అందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. పాలకులు మతానికి దూరం పాటించనప్పుడే దేశంలో అసహనం పెరుగుతుందని అన్నారు.