శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (17:32 IST)

ప్రాథమిక విద్యను బోధించని మదర్సాలకు నిధులు కట్ : మహారాష్ట్ర సర్కారు

మహారాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక విద్యను బోధించని మదర్సాలకు ప్రభుత్వం అందించే నిధులను అందించబోమని ఆ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అధికారిక లెక్కల ప్రకారం 1,889 మదర్సాలు ఉండగా, వాటిలో 1.48 లక్షల మందికి పైగా చిన్నారులు ఉన్నారు. మదర్సాలలో ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టుల బోధన తప్పనిసరి చేయాలని 'మహా' సర్కారు కిందటి నెలలో నిర్ణయించింది. దీనిపై విమర్శలు చెలరేగాయి. 
 
అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులను బోధించని మదర్సాలకు గుర్తింపు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులు బోధించని మదర్సాలను పాఠశాలలుగా పేర్కొనలేమని, వాటిలో ప్రాథమిక విద్యను బోధిస్తున్నట్టు కనిపించడంలేదని తెలిపింది. ఈ క్రమంలో జులై 4న రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలను పరిశీలించాలని నిర్ణయించింది. కాగా, ఒక్కో మదర్సాకు ప్రభుత్వం యేడాదికి రూ.5.50 లక్షల చొప్పున నిధులు ఇస్తోంది.