బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (07:58 IST)

లేపేస్తాం... ! మహారాష్ట్ర మంత్రికి మాఫియా వార్నింగ్

మహారాష్ట్రలో మాఫియా తన సత్తా చూపుతోంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రినే హెచ్చరించే స్థాయికి తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు పలుమార్లు హెచ్చరికలు ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే లేపేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన తప్పేంటి..? వారెందుకు మంత్రికి వార్నింగ్ ఇస్తున్నారు..? వివరాలు.. 
 
చంద్రపూర్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రై జిల్లా’గా ప్రకటించింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునుగంటివార్‌ ఆ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. చంద్రపూర్‌లో మద్యం అమ్మకాలు, ఉత్పత్తి, వినియోగంపై నిషేధం విధించడంలో సుధీర్ కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వ ఆదేశాల అమలులో కఠినంగా వ్యవహరించారు. ఇది మద్యం మాఫియాకు సహజంగానే మంట పుట్టించింది. అతనిపై కత్తికట్టింది. వారం కూడా తిరగకుండానే తమ సత్తా చూపేందకు తెగబడుతున్నారు.
 
పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా ఆయన లెక్కపెట్టలేదు. తన పని తాను చేసుకుపోయారు. డ్రై జిల్లాను చాలా స్ట్రిక్టుగా అమలు చేశారు. అయితే మూడు రోజుల కిందట వచ్చిన బెదిరింపు లేఖ ఆందోళన కలిగించేలా ఉంది. అగంతకులు రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తామని, అతని అంతం చూస్తామని సుధీర్ ను బెదిరించారు.
 
దీంతో మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆగంతుకుల కోసం గాలిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వార్ధా, గడ్చిరౌడీ జిల్లాలను మద్యనిషేధం సాధించిన జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించిన విషయంతెలిసిందే. ఇదిలా ఉండగా, ప్రజా పనుల శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండేకు సైతం ఇటీవల ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిసింది.