గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (11:56 IST)

మహారాష్ట్రలో మంఝీ... హమారా మహాన్ అంటున్న గ్రామస్తులు... ఎందుకు?

అతనో చిన్నపల్లె పంతులు... కానీ ఆశయం మాత్రం హిమాలయ పర్వతాలంత ఎత్తైనది. అకుంటిత దీక్షతో మౌంటెన్‌మేన్‌గా మారాడు. కొండ ప్రాంతానికి చెందిన ఏడు గ్రామాలకు మార్గదర్శకుడుగా, మహనీయుడుగా మారాడు రాజారాం భాప్కర్. ఈ మధ్యలో వచ్చిన బాలివుడ్ సినిమా మాంఝీకి ఏమాత్రం తీసిపోని సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. 
 
రాజారాం భాప్కర్ తను ఏడో తరగతి చదివేటప్పుడు గుండెగావ్ అనే తన సొంతూరు నుంచి పక్క ప్రాంతానికి వెళ్లడానికి కనీసం కాలిబాట కూడా లేదు. ఊరివాళ్లంతా ఒక రోడ్డు వేయండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకోవడం రాజారాంను ఉత్తేజితం చేసింది. బాగా చదువుకుని టీచర్‌గా సెటిలైనప్పటికీ ఊరి కోసం కనీసం రోడ్డైనా వేయాలన్న తపన మాత్రం ఆయన్ని వదల్లేదు. 
 
అయితే ఆ గ్రామానికి రోడ్డు వేయడం అనేది అంత సులువుకాదు. సంతోషా అనే పేరు గల 700 మీటర్ల ఎత్తున్న కొండను తవ్వాలి. కానీ ఆ అడ్డంకి  ఆయన సంకల్పం ముందు చిన్నదిగా కనిపించింది. తన జీతం డబ్బులనే వాళ్లకు కూలీగా చెల్లించేవాడు. అక్కడ మొదలుపెట్టి 57 ఏళ్లపాటు శ్రమించాడు. సమీప ప్రాంతాలకు అడ్డుగావున్న ఏడు కొండలను తవ్వి మొత్తం 40 కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేశాడు. 
 
గుండెగావ్ నుంచి కోలెగావ్ అనే ప్రాంతానికి వెళ్లడానికి ఇంతకుముందు 29 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడది 10 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఒక కొండను తవ్విన దశరథ్ మాంఝి మౌంటెన్‌మేన్ ఐతే, ఏడు కొండల్ని నుజ్జు చేసి ఊరి రుణం తీర్చుకున్న రాజారాంని ఏమనాలి?