శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (09:54 IST)

మగాడి కడుపులో గర్భాశయం... వెలికి తీసిన కర్ణాటక వైద్యులు

పురుషుడి కడుపులో ఉన్న గర్భాశయాన్ని కర్ణాటక వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ఈ అరుదైన సంఘటన కర్ణాటక రాష్ట్రం కోలారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాకు చెందిన 58 ఏళ్ళ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో ఇటీవల చేరాడు. హెర్నియాతో బాధపడుతున్నాడంటూ అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
 
ఆ సమయంలో కడుపులో గర్భాశయం, అండాశయం, స్త్రీ జననాంగ భాగాలు ఉన్నట్లు గుర్తించి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.ఎన్.శ్రీరాములుకు తెలిపారు. దీంతో పరిస్థితిని రోగికి వివరించి అతని అనుమతితో గురువారం శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయం, అండాశయం తొలగించారు. 
 
ఈ అరుదైన శస్త్రచికిత్సలో వైద్యులు శ్రీనివాస్, సోమశేఖర్, ఆనంద్, పవన్ కట్టి, సిబ్బంది పాల్గొన్నారు. పుట్టుకతో హార్మోన్ల లోపం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, ఫలితంగా అతనికి సంతాన ప్రాప్తి లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఇతనికి ఒకే వృషణం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.