శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (09:24 IST)

మనసు విరిగిపోయిన షర్మిల.. ఇక ఆ బంధమే వద్దనేసింది

తన ప్రాంత మహిళలను అత్యాచారాలు చేసి మరీ చంపుతున్న భారత సైన్యంపై పదహారేళ్లపాటు నిరాహార్ దీక్ష చేసి సాయుధ బలగాలకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాల హక్కును రద్దు చేయాలంటూ పోరాడిన ఆ ధీర వనిత ఇప్పుడు తన సొంత ప్రాంతంతో ఎలాంటి సంబంధమూ తనకు ఇక లేదని తేల్చి చెప్

కన్న ఊరు, కన్న తల్లి స్వర్గంతో సమానం అనేది చాలా పాత మాట. కానీ తన ప్రాంత మహిళలను అత్యాచారాలు చేసి మరీ చంపుతున్న భారత సైన్యంపై  పదహారేళ్లపాటు నిరాహార్ దీక్ష చేసి సాయుధ బలగాలకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాల హక్కును రద్దు చేయాలంటూ పోరాడిన ఆ ధీర వనిత ఇప్పుడు తన సొంత ప్రాంతంతో ఎలాంటి సంబంధమూ తనకు ఇక లేదని తేల్చి చెప్పేశారు. ఏ ప్రజల హక్కుల కోసమైతే, ఎవరి ధనమాన ప్రాణ సంరక్షణ కోసం 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసి చరిత్ర సృష్టించిందో అ మణిపూర్ ప్రజలే ఎన్నికల్లో తనకు వంద ఓట్లు కూడా వేయకపోయేసరికి భరించలేకపోయిందా సున్నిత హృదయురాలు. ఆమె ఇరోమ్ షర్మిల
 
ఆమె పోరాటం ఆమె కోసం కాదు, తన వాళ్ల కోసం, తనలాంటి వారి కోసం. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అది చట్టం రూపంలో అమలవుతోంది. ఆ వెసులుబాటే స్థానికులకు దినదినగండంగా మారింది. వారి బతుకులను వారిని బతకనివ్వని దారుణాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియచేయాలని నిరాహార దీక్షకు పూనుకుంది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జీవితాన్ని ఫణంగా పెట్టింది. హక్కుల పోరాటంలో నిరాహార దీక్షకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీచేసింది ఇరోమ్‌. తాను ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే పోరాటం చేస్తున్నానని ఆమె గట్టిగా విశ్వసించింది. ఆ నమ్మకాన్ని మణిపూర్‌ ప్రజలు నిలబెడతారని ఆశించింది. కానీ ఓట్లు వందకు లోపే రావడంతో యావత్తు దేశం నివ్వెరపోయింది.
 
మణిపూర్‌లో గత మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. ఎవరి బతుకులు బాగుపడడానికి తన జీవితాన్ని అంకితం చేసిందో ఆ ప్రజలే ఆమెను అక్కున చేర్చుకోలేకపోయారు. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా అసాధ్యమే. ఆమెకూడా అలాగే తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆమె భుజం తట్టి అండగా నిలిచాడు డెస్‌మాండ్‌ కూటిన్‌హో. గోవాలో పుట్టిన  డెస్‌మాండ్‌ ప్రస్తుతం బ్రిటన్‌ పౌరుడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి  డెస్‌మాండ్‌ ఎప్పుడూ సిద్ధమే. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆమెను మణిపూర్‌ నుంచి కొడైకెనాల్‌కు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉందామె.
 
గడచిన బుధవారం కొడైకెనాల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఈ హక్కుల ఉద్యమకారులిద్దరూ తమ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘ఇకపై మణిపూర్‌కి వెళ్లను’’ అని, అది తన వ్యక్తిగత నిర్ణయం అని మీడియాకు చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇకపై తాను సాధారణ మహిళగానే జీవితాన్ని గడపాలనుకుంటున్నానని 45 ఏళ్ల షర్మిల చెప్పారు. ఐరన్‌లేడీ తీసుకునే నిర్ణయం ఏదైనా ఉక్కులా గట్టిగానే ఉండవచ్చు.