శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (11:23 IST)

గోవా ముఖ్యమంత్రి ప్రాణాలకు రక్షణ కల్పించండి : కాంగ్రెస్

రఫెల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వద్ద ఉన్నాయనీ, అందువల్ల ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు రాష్ట్రపతికి గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓ లేఖ రాసింది.
 
రఫెల్‌ ఒప్పందం వివరాలు బయటకు వస్తే అందులో అవినీతి జరిగిందని ప్రజలకు తెలుస్తుందని, అందుకే ఆ వివరాలు బయటకు రాకూడదని కోరుకునే వారు పారికర్‌కు హాని తలపెట్టే ప్రమాదముందని ఆయనకు తగిన రక్షణ కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆ లేఖలో పేర్కొంది.
 
రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు తన పడక గదిలో ఉన్నాయని మనోహర్‌ పారికర్‌ చెప్పారని గోవా మంత్రి విశ్వజిత్‌ రాణె ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్న ఆడియో టేప్‌ను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా అదంతా కల్పిత ఆడియో టేప్‌ అని పారికర్‌ ఖండించారు. ఈ విషయంపై భాజపా, కాంగ్రెస్‌ల మధ్య దుమారం రేగింది. లోక్‌సభలో కూడా చర్చ జరిగింది. రఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. భాజపా నేతలు అదే స్థాయిలో కాంగ్రెస్‌పై ప్రతిదాడికి దిగుతున్నారు.