శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 28 మార్చి 2015 (07:29 IST)

మీరు రిచ్చా... అయితే వంట గ్యాస్ వదులుకోండి ప్లీజ్ : మోడీ

మీరు శ్రీమంతులా... స్థిమంతులా...? రిచ్ గా ఉన్నారా... అయితే వంట గ్యాస్ స్వచ్ఛందంగా వదులుకోండి ప్లీజ్.. ఇలా అన్నది ఎవరో కాదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. దానివలన భారత దేశం ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని చెబుతున్నారు. ఇందన భద్రత, పొదుపు చర్యల్లో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఇంధన సంగమం(ఉర్జా సంగమ్) సదస్సులో  మోదీ మాట్లాడారు. సిలిండర్లపై వదులుకునే రాయితీ పేదల సంక్షేమానికి పనికొస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  ఇప్పటికే దేశంలో 2.80 లక్షల మంది రాయితీని వదులుకుని 'గివ్ ఇట్ ఆప్'లో భాగస్వాములయ్యారని, తద్వా రా రూ.100 కోట్ల ప్రజా ధనం మిగిలిందని ప్రధాని చెప్పారు. ఈ నిధుల ద్వారా మరింత మంది పేదలకు సిలిండర్లు అందజేస్తామన్నారు. 
 
 రాయితీ మిగులు ఫలాల్ని పేదలకు అందజేయడంతోపాటు, సంచార జాతుల వారికి 5 కేజీల సిలిండర్లు అందచేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇంధన రంగం బలోపేతం చేసే దిశగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, ఇథనోల్‌కు కనీస మద్దతు ధర కల్పించామని చెప్పారు.
 
బంజరు భూముల్లో జట్రోపా సాగు చేసి బయోడీజిల్ రూపంలో అభివృద్ధి చేయాలని రాష్ట్రాలను కోరామన్నారు. గ్యాస్ గ్రీన్ నెట్‌వర్క్ విస్తరణ చేపట్టి పట్టణాల్లోని కుటుంబాలకు పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. నాలుగేళ్లలో కోటి మందికి పైపులైన్ల ద్వారా గ్యాస్ అందజేస్తామని చెప్పారు.