బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (17:01 IST)

గర్భంలోనే శిశువు తలను వదిలేసిన వైద్యులు.. శిశువు, మహిళ మృతి..

ఇటీవల కొన్ని రోజులుగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక ప్రసూతి ఆస్పత్రిలో వైద్యులు, ఆస్పత్రి శిబ్బంది అలక్ష్యం వలన పుట్టిన పసి బిడ్డను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ వార్త చెవిన పడి కొన్ని గంటలు కూడా గడవలేదు ఇంతలోనే ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
 
పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు ప్రసవం చేస్తున్న వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కడుపులోనే వదిలేశారు. బిడ్డ శరీరాన్ని మాత్రం బయటకు తీశారు. దీంతో తల్లి ప్రాణం కూడా పోయింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రోజు ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
 
స్థానిక మహిళ గీతాదేవీ (32) శనివారం రాత్రి ప్రసవ వేదనతో షాజహాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ప్రసవ సమయంలో శిశువు శరీరం మాత్రం బయటకు వచ్చి, తల గర్భసంచిలోనే చిక్కుపోయింది. దీంతో అక్కడి వైద్యులు చేతులెత్తేసి మరో ఆస్పత్రికి తీసుకు వెళ్లమని గీతాదేవీ భర్త హేమంత్‌కు సూచించారు.  


దీంతో హుటాహుటిన ఆమెను సమీపంలోని బెరైల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు తల్లి గర్భం నుంచి శిశువు తలను బయటకు తీశారు. అయితే తల్లి ప్రాణాలు కాపాడలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, బిడ్డ మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.