జమ్మూకాశ్మీర్ తదుపరి సీఎంగా మెహబూబా ముఫ్తీ
జమ్మూకాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నియమితులు కానున్నారు. శ్రీనగర్లో సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం ఆమెను శాసనసభా నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ ఎన్ఎన్ ఓహ్రాను కలిసి లేఖ అందించారు. దీంతో 53 యేళ్ల మెహబూబా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావడం లాంఛనం కానుంది.
అయితే ప్రమాణస్వీకారోత్సవం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్లో పీడీపీ - భాజపా సంకీర్ణ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ అస్వస్థతతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.