బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:05 IST)

అధికారంలోకి డీఎంకే వస్తుందా..? ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ ఎందుకు.. పన్నీర్‌కు కన్నీరేనా?

తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకెళ్లేందుకు బెంగళూరుకు ప్రయాణమయ్యారు

తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకెళ్లేందుకు బెంగళూరుకు ప్రయాణమయ్యారు. మరోవైపు పళని-పన్నీరు వారుకు సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే సమావేశం కావాలని బుధవారం ఆదేశించారు.

బుధవారం మద్నాహ్నం డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని సూచించారు. తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సమయంలో ఎమ్మెల్యేలతో కలిసి ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీ కోర్టు దోషిగా ప్రకటించిన తరువాత స్టాలిన్ చాకచక్యంగా పావులుకదుపుతున్నారు.
 
ఇక తమిళనాట డీఎంకే ప్రధాన ప్రతిపక్షం. ఇక అన్నాడీఎంకే పార్టీలోని శాసన సభ్యులు, ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీన్ని అదనుగా తీసుకుని డీఎంకే అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎడప్పాటి పళనిసామి తమిళనాడు సీఎం అభ్యర్థిగా తెర మీదకు వచ్చారు.
 
అయితే పన్నీర్ సెల్వంకు ఊహించనంత ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో స్టాలిన్ డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యడం సంచలనం రేపింది. గతంలో పలుసార్లు పన్నీర్ సెల్వం పనితీరును స్టాలిన్ మెచ్చుకున్నారు.

శశికళ వర్గాన్ని అడ్డుకోవడానికి పన్నీర్ సెల్వంకు బయటి నుంచి డీఎంకే పార్టీ మద్దతు ఇస్తుందా? లేక రెబల్ ఎమ్మెల్యేల సహకారంతో డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందా? అనే విషయం తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. కానీ చెన్నైకి ఎమ్మెల్యేలను రావాల్సిందిగా ఆహ్వానించలేదని స్టాలిన్ ప్రకటించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.