మోడల్పై అత్యాచారం కేసు: మహారాష్ట్ర డీఐజీ సస్పెండ్!
మోడల్పై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర డీఐజీ సునీల్ పరాస్కర్ను పోలీసు విధుల నుండి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవన్ వద్దకు చేరింది.
కాగా మోడల్పై అత్యాచారం కేసులో సునీల్ పరాస్కర్కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జులై నెల 25న సునీల్ పరాస్కర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ముంబై మాజీ అదనపు నగర కమీషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి ఆయన్ని కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉండి తనపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఆరోపించింది. సునీల్ పరాస్కర్ వయసు 57 సంవత్సరాలు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మలవానీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితురాలు ముంబై పోలీసు కమీషనర్ రాకేశ్ మారియాను కలిసి సునీల్ పరాస్కర్పై ఫిర్యాదు చేసింది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ పరాస్కర్పై ఆరోపణలకు సంబంధించి నివేదిక సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.