శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (12:00 IST)

పగ తీర్చుకుంటున్న కోతి.. ముగ్గురు రైలు డ్రైవర్లపై దాడి..!

ప్రముఖ దర్శకేంద్రుడు రాజమౌళి 'ఈగ' చిత్రాన్ని తలపించే సంఘటన ఒకటి బీహార్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పగలు, ప్రతీకారాలు మనుషులకే కాదు, జంతుజీవరాశులు అన్నిటికి ఉంటాయని మరోసారి రుజువైంది. బీహార్‌లో రైలు డ్రైవర్లపై పగపట్టిన ఒక కోతి, అక్కడికి వచ్చే ప్రతి డ్రైవర్‌పై దాడి చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. 
 
వివరాల్లోకి వెళితే.. గత వారం బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మికీ రైల్వే స్టేషన్ వద్ద ఓ కోతి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందింది. ఇక అప్పటి నుంచి దాని తోబుట్టువు అయిన మరో కోతి రైలు డ్రైవర్లపై ప్రతీకారం పెంచుకుంది. దీంతో వరుసగా ముగ్గురు రైల్వే డ్రైవర్లపై కోతి దాడి చేసింది.
 
ఇద్దరు డ్రైవర్లను తోటి రైల్వే ఉద్యోగులు కోతి దాడి నుంచి రక్షించారు. మరో డ్రైవర్ రైలు క్యాబిన్‌లోనే ఉండి ప్రాణాలను కాపాడుకున్నాడు. మరో గూడ్స్ రైలు డ్రైవర్ పైనా దాడికి ప్రయత్నించింది. అతడ్ని కూడా రైల్వే సిబ్బంది కాపాడారు. 
 
కాగా, ఈ ఘటనల నేపథ్యంలో వాల్మికీ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైళ్లు ఆపే ముందే డ్రైవర్లను ఇక్కడి రైల్వే సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఈ సంఘట ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.