ఉగ్రవాదుల వల్లే కాశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి : జేకే సీఎం
జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది నిమిషాల్లోనే ముఫ్తీ మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడానికి అనువైన వాతావరణం కల్పించిన ఘనత సరిహద్దు ఆవలి వైపు ఉన్న ప్రజలు (పాక్), హురియత్, ఉగ్రవాద వర్గాలకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.
ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడుతూ ‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణాన్ని సృష్టించిన క్రెడిట్ హురియత్కు, మిలిటెంట్ గ్రూపులకే దక్కుతుంది. ఈ విషయాన్ని నేను అధికారికంగా చెప్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీకి సైతం ఈ విషయం చెప్పాను' అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ‘సరిహద్దుకు ఆవలి వైపు ఉన్న ప్రజలు (పాక్) కూడా ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూశారు. వాళ్లు గనుక ఏదైనా చేసి ఉంటే ఎన్నికలు శాంతియుతంగా జరిగి ఉండేవి కావనే విషయాన్ని నేను వినమ్రంగా అంగీకరిస్తున్నాను. ఎన్నికలకు విఘాతం కలగడానికి చిన్నపాటి సంఘటన చాలనే విషయం మీకు తెలుసన్నారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ సాఫీగా జరగడానికి వాళ్లు అనుమతించారు. ఇది మాకు ఆశను కల్పిస్తోందన్నారు.