డాక్టర్ నిర్లక్ష్యంతోనే శిశువు మృతి...! రూ.19 లక్షలు జరిమానా..!
ప్రసవం చూసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, శిశువు మృతికి కారణమైన డాక్టర్ 19 లక్షల రూపాయలను నష్టపరిహారంగా బాధిత తల్లికి చెల్లించాలని వినియోగదారుల ఫోరం సంచలనాత్మక తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే, 2003లో ముంబైలో సోనూ కరీర్ అనే గర్భవతి మాతృశయా అనే ఆసుపత్రికి తరచూ పరీక్షల కోసం వెళ్తుండేది. అక్టోబర్ 18న తీవ్ర నొప్పులతో అదే ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యుడు వెంటనే మరో ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పాడు. దీంతో పాటు ఏ క్షణంలోనైనా బిడ్డ జన్మించవచ్చని తెలిపాడు.
దీంతో వెంటనే అక్కడి నుంచి సమీపంలోని కందివిలిలోని మరో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలోని డాక్టర్ నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో పాటు పరీక్షలు నిర్వహించి మరో పదిహేను నిమిషాల్లో ఆమె డెలివరీ అవుతుందని ఇంటికి వెళ్లిపోయాడు.
ఆమె డెలివరీని నర్సే దగ్గరుండి చూసింది. అనంతరం వచ్చిన డాక్టర్ బేబిని చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పగా, మార్గం మధ్యలోనే బేబి చనిపోయింది. బాధిత మహిళ తండ్రి పంకజ్ ఆమె తరుపున వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. కేసును విచారించిన ఫోరం శిశువు మృతికి ముమ్మాటికి వైద్యుల నిలక్ష్యమే కారణమని తేల్చింది. అంతేకాకుండా రూ. 19 లక్షలు చెల్లించాల్సిందేనని ఫోరం ఆదేశించింది.