శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2017 (10:48 IST)

అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. ముస్లింల మద్దతు.. లక్నోలో పది హోర్డింగులు..

అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశంకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యూపీలో బీజేపీ సర్కారు పూర్తి మెజారిటీ ఏర్పడటంతో పాటు.. యోగి ఆదిత్యనాథ్ వంటి హిందుత్వవాది సీఎం కావడంతో రామ మందిర ని

అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశంకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యూపీలో బీజేపీ సర్కారు పూర్తి మెజారిటీ ఏర్పడటంతో పాటు.. యోగి ఆదిత్యనాథ్ వంటి హిందుత్వవాది సీఎం కావడంతో రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని హిందుత్వ సంస్థలు భావిస్తున్నారు. యూపీ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో రామమందిర అంశాన్ని చేర్చిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా రామమందిరంకు ముస్లింల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది. పలు ముస్లిం సంఘాలు, ముస్లిం పెద్దలు కూడా అయోధ్యలో రామమందిరంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, హిందువులు పవిత్రంగా భావించే అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిందిగా వారు కోరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. అతి త్వరలోనే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ మాత్రం ఒక రూట్ మ్యాప్‌ను ప్రకటించలేదు.
 
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతుగా ముస్లింలు బ్యానర్లు కడుతున్నారు. వీటిని కట్టిన సంస్థల నేతలు మాట్లాడుతూ అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో తాము ఈ విధంగా తమ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో రామ మందిర నిర్మాణం గురించి ఉంది. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధంగా రామాలయాన్ని నిర్మిస్తామని పేర్కొంది. 
 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టు బయట పరిష్కారానికి మద్దతిస్తున్నట్లు శ్రీరామ్ మందిర్ నిర్మాణ్ ముస్లిం కర సేవక్ మంచ్ అధ్యక్షుడు అజం ఖాన్ చెప్పారు. ఆయన లక్నోలో 10 హోర్డింగులను పెట్టారు. ఆజం ఖాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పెరుగుతోంది. ఆయనతో అనేకమంది యువత చేతులు కలుపుతున్నారు. వివాదాన్ని తిరగదోడుతూ ఇరు మతాల పెద్దలు ప్రజల మధ్య ద్వేష భావం పెంచుతున్నారని ఈ యువత ఆరోపిస్తోంది. ఇరు మతాలకు పెద్దలమని తమకు తాము చెప్పుకుంటున్నవారు వైదొలగితే అయోధ్య వివాదం చిటికెలో పరిష్కారమవుతుందన్నారు. సామాన్యులకు రామ మందిర నిర్మాణం వల్ల సమస్య ఏమీ లేదన్నారు.
 
అయితే ప్రస్తుతం ఆజం ఖాన్‌కు ఇద్దరు సాయుధ గార్డులు రక్షణగా ఉన్నారు. తనకు ఫోన్లు, ఈ-మెయిళ్ళ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని, తనకు భద్రతను పెంచాలని ఆయన కోరారు. బాబ్రీ మశీదు పునర్నిర్మాణానికి అనుకూలంగా మాట్లాడాలని హెచ్చరికలు వస్తున్నాయన్నారు. తాను చేస్తున్న ప్రయత్నాలను ఆపేందుకు డబ్బులు ఇస్తామని కూడా కొందరు చెప్తున్నారని తెలిపారు.