శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (09:47 IST)

'అమ్మ' మరణం వెనుక నిజాలు : జయలలితకు తప్పుడు ఔషధాలు?

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మధుమేహంతో బాధపడుతూ వచ్చిన జయలలితకు తప్పుడు మందులు ఇవ్వడం వల్లనే ఆస్పత్రి పాలైనట్టు తెలుస్

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మధుమేహంతో బాధపడుతూ వచ్చిన జయలలితకు తప్పుడు మందులు ఇవ్వడం వల్లనే ఆస్పత్రి పాలైనట్టు తెలుస్తోంది. ఈ విషయం ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ బర్ఖాదత్ తన సహచరులకు, యాజమాన్యానికి పంపిన ఈమెయిల్‌ ఈ ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానం ఇస్తోంది.
 
గత సెప్టెంబరు 22న జయలలితను తమ వద్దకు తీసుకొచ్చేటప్పటికే.. ఆమెకు డయాబెటీస్‌‍కు సంబంధించి ఇవ్వాల్సిన ఔషధాలు కాకుండా వేరే ఔషధాలు ఇస్తున్నట్టు అపోలో యాజమాన్యం తనతో చెప్పినట్టు బర్ఖాదత్ ఆ మెయిల్‌లో(ఆఫ్‌ ద రికార్డుగా పేర్కొంటూ) వివరించారు. మామూలుగా అయితే ఈ వివరాలు బయటికి వచ్చేవి కావేమోగానీ.. ఇటీవలే బర్ఖాదత్ ఈమెయిల్‌, ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసిన హ్యాకర్ల గ్రూపు బర్ఖాదత్ ఇన్‌బాక్స్‌లోని ఈ మెయిల్‌ను బయటపెట్టింది. 
 
మరోవైపు జయలలితకు 75 రోజుల పాటు అందించిన చికిత్సపై శ్వేతపత్రం విడుదల చేయాలని తమిళనాడు విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అదేసమయంలో 'అమ్మ' మరణం వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డికి, ఎండీ ప్రీతారెడ్డికి, జయ నెచ్చెలి శశికళకు నిజనిర్దారణ పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ప్రముఖ సామాజిక సేవకుడు ట్రాఫిక్‌ రామస్వామి ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. 
 
ఇంకోవైపు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలుసుకుని.. జయ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వినతి పత్రం కూడా సమర్పించారు.