'నీట్' నిర్వహించాల్సిందే.. కేంద్రం పిటీషన్ తిరస్కృతి : సుప్రీంకోర్టు
దేశంలోని వైద్య కాలేజీల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహించాల్సిందేనంటూ గురువారం ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు ఉండబోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆదేశాలు జారీ చేశాక పాటించి తీరాల్సిందేనంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
నీట్ పరీక్షతో పాటు.. ప్రీమెడికల్ ఎంట్రెన్స్ (ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం) పరీక్షను నిర్వహించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని, నీట్ పరీక్షను నిర్వహించాలని కోరుతూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ పిటీషన్ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చిన కోర్టు... ప్రకటించిన షెడ్యూల్ మేరకే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాలని తేల్చి చెప్పింది.
అయితే, గురువారం జారీచేసిన ఉత్తర్వుల్లో సవరణలు కోరుకుంటే దరఖాస్తులను అందజేయాలని సూచించింది. సవరణలు కోరితే వాటిపై విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నీట్ను మే1, జులై 24న నీట్ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది.