బీహార్ లో కొత్త పార్టీ...? మాంఝీ ప్రయత్నాలు
బీహార్ రాజకీయాలు మళ్లీ తెరపైకి ఎక్కనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మాంఝీ కొత్త పార్టీని పెట్టే సిద్ధమవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తరహాలో ముందుకు రావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ ఆయన మద్దతుదారులు హిందూస్తాన్ అవామీ మోర్చా పేరుతో ఓ ఫ్రంట్ను స్థాపించారు. అదే పేరును ఖారారు చేస్తారా.. లేక కొత్త పార్టీ ఏదైనా పెడతారా అనేది చూడాల్సి ఉంది.
దీనిపై మాంఝీ మాట్లాడుతూ హిందూస్తాన్ అవామీ మోర్చాను ప్రారంభించామని, ఇది అందరినీ కలుపుకొని వెళ్తుందని చెప్పారు. ఇక్కడ ఆయన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇది ఏఏపీ కంటే ఉన్నతంగా ఉంటుందని చెప్పారు. అందుకే హిందుస్తాన్ అవామీ మోర్చా అనే ఫ్రంట్ తీసుకు వచ్చినట్లు చెప్పారు.
మరోవైపు, జీతన్ రామ్ మాంఝీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల వివక్ష చూపించి తనను నితీష్ అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారని ధ్వజమెత్తారు. బీహార్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. మొత్తంపై బీహార్ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.