శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (09:49 IST)

ఉప రాష్ట్రపతి వద్దు.. ఉషాపతిగా ఉండటమే ముద్దంటున్న వెంకయ్య!

భారత ఉపరాష్ట్రపతి రేసులో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడి పేరు తెరపైకి వచ్చింది. యూపీఏ కూటమి తరపున ఇప్పటికే జాతిపిత మహాత్మా గాంధీ మనవడు, వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ

భారత ఉపరాష్ట్రపతి రేసులో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడి పేరు తెరపైకి వచ్చింది. యూపీఏ కూటమి తరపున ఇప్పటికే జాతిపిత మహాత్మా గాంధీ మనవడు, వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారు చేసింది. కానీ, బీజేపీ మాత్రం ఇప్పటివరకు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వస్తోంది. 
 
అయితే, అనూహ్యంగా వెంకయ్య పేరు తెరపైకి వచ్చింది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ పదవికి వెంకయ్యనాయుడు అన్నివిధాలా సమర్థుడనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం. వెంకయ్యనాయుడు అయితేనే, భాగస్వామ్య పక్షాలన్నీ ఆమోదిస్తాయనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. 
 
పార్టీ కీలక నేతగా సంక్షోభ సమయాల్లో వెంకయ్యనాయుడు పోషించిన పాత్రను బీజేపీ పరిగణనలోకి తీసుకుందని సమాచారం. వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఏ రకంగా చూసినా కూడా ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని, ఆ పదవికి వన్నె తెస్తారనే సమష్టి అభిప్రాయానికి ఎన్డీఏ పక్షాలు వచ్చాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అయితే, వెంకయ్య నాయుడు మాత్రం క్రియాశీలక రాజకీయాలను తప్పుకుని రాజ్యాంగ పదవిని అధిరోహించేందుకు సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు.. పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు కూడా. తాను ఉషాపతిగానే ఉంటానని, ఉపరాష్ట్రపతే కాదు.. ఏ పతులు తనకు అక్కర్లేదని తెగేసి చెప్పారు. 
 
కానీ, బీజేపీ అధినాయకత్వం మాత్రం వెంకయ్య వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఓ.రాజగోపాల్, నజ్మాహెప్తుల్లా, సీహెచ్ విద్యాసాగర్ రావు వంటి పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. దీంతో వెంకయ్య పేరును చివరి నిమిషం వరకు సస్పెన్స్‌లో ఉంచేలా తెలుస్తోంది.