శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (07:00 IST)

ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో కేంద్ర ఆదాయం తగ్గుతుందా..? అందుకే ఎగ్గొట్టారా..!

‘ఆంధ్ర-ప్రత్యేక హోదా’ అనే అంశం విభజన చట్టం వరకు వచ్చిఅక్కడే ఆగిపోయింది. ఈ లోపు నాటి ప్రభుత్వానికి పాలనా సమయం ముగిసిపోవడంతో చట్టం కాలేకపోయింది. అయితే ప్రత్యేక హోదాపై అప్పట్లో గగ్గోలు పెట్టిన నేటి అధికార పార్టీ ఎందుకు మోకాలడ్డుతోంది.? ఎవరెన్ని చెప్పినా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ససెమిరా అంటోంది ? ఎన్ని మార్గాలు చూపినా ‘ఇవ్వలేం’ అని శుక్రవారం నాటికి కుండ బద్దలు కొట్టేసింది. దీనికి కారణం ఏంటి ? తమ ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందనా..?  
 
ప్రణాళికా సంఘం అభ్యంతరం చెబుతోందంటూ మరో సానుకు ముందుకు తీసుకువచ్చి ప్రత్యేక హోదా కలేనని స్పష్టం చేసింది. ఇంతకీ కారణం ఏంటాని ఆర్థిక నిపుణులను ఆరా తీస్తే కేంద్రానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుందట. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ నో చెబుతోందట. ఇక రాజకీయంగా కూడా పెద్దగా లాభం లేకపోవడంతో ఆంధ్రాకు ప్రత్యేక హోదా అటకెక్కించడానికి తీర్మానించారు. 
 
ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై ఎంపీ మాగంటి బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదని తెలిపారు. అటు, తెలంగాణ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి కూడా తెలంగాణకు ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్న అడిగారు. ఆయనకూ ఇదే సమాధానం వర్తింపజేశారు మంత్రి ఇంద్రజిత్ సింగ్. 
 
ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై ఆశలు వదిలేసుకున్నట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలే చెబుతున్నాయి. ప్రత్యేక హోదా వస్తే లభించే నిధుల కన్నా కేంద్రం ఎక్కువ నిధులే ఇవ్వాలని భావిస్తోందని ఆయన పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. ఆంధ్రాలో అధికార పార్టీ నోరు మెదపలేని స్థితిలో ప్రత్యేక హోదాపై మిన్నకుండిపోవడం, ప్రతిపక్ష పార్టీ నోరు మెదపలేని స్థితిలో ఉండిపోవడంతో భారతీయ జనతాపార్టీ ప్రత్యేక హోదాను అటకెక్కిస్తే అడిగేదెవరు? అనే స్థితికి దిగజారింది. నాలుగేళ్ళ ఎన్నికల తరువాత ఏదోక తారక మంత్రం జపించవచ్చునని ఆలోచిస్తోంది.