శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (18:28 IST)

మే 1 నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు: ఈసీ ప్రకటన

మే 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ఈవీఎంలపై అభ్యర్థుల ముఖచిత్రాలు, పేర్లు, గుర్తులు ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు  ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తత్కారే 2100 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అదే సమయంలో, సునీల్ తత్కారే అనే డమ్మీ అభ్యర్థికి 9,500 ఓట్లు పోలయ్యాయి. 
 
డమ్మీ అభ్యర్థి బరిలో లేకపోయి ఉంటే ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తత్కారే గెలిచేవాడన్న వాదనలు వినవచ్చాయి. ఇద్దరి పేర్లూ సునీల్ తత్కారే కావడంతో ఓటర్లు గందరగోళానికి గురైనట్టు తెలిసింది. పార్టీలు ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దించుతాయన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని నిరోధించేందుకే పేర్లతో పాటు గుర్తులు, ఫోటోలు ఈవీఎంలపై ఉండి తీరాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.