గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:12 IST)

చర్యలు తీసుకున్నా ఐఎఫ్ఎస్‌కు రాజీనామా చేయను : దేవయాని

గత ఏడాది న్యూయార్క్‌లో భారతీయ దౌత్యవేత్తగా పనిచేస్తూ వీసా మోసం కేసులో చిక్కుకున్న దేవయాని ఖోబ్రాగడే మరోమారు చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రభుత్వం అనుమతి లేకుండా తన పిల్లలకు అమెరికా పాస్‌పోర్టులు పొందడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి, శాఖాపరమైన చర్యలు చేపట్టింది. అయితే, దీనిపై దేవయాని తీవ్రంగానే స్పందించారు. తనపై ప్రభుత్వం చర్య తీసుకున్నా ఐఎఫ్‌ఎస్‌కు రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన పిల్లలకు రెండు దేశాల పాస్‌పోర్టులు తీసుకున్నా కరెక్టేనని ఆమె చెప్పుకుంటున్నారు.
 
వాస్తవానికి ఆమె ప్రస్తుతం ఈమె న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అభివృద్ధి భాగస్వామ్య విభాగ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం దాచిపెట్టడమే కాకుండా, మీడియాకు బహిర్గతం చేసినందుకు గాను దేవయాని ఖోబ్రాగడేను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దేవయానిని శిక్షించే ఉద్దేశంతో ‘కంపల్సరీ వెయిటింగ్‌’లో ఉంచింది. 
 
పాలనాపరంగా ప్రభుత్వం ఆమెపై తదుపరి చర్య తీసుకోనున్నదనీ అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఇదే సమయంలో దేవయాని వీసా మోసం బయటపడడంతో భారత్‌, అమెరికాల మధ్య తీవ్రస్థాయిలో దౌత్య వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెప్పకుండా దేవయాని తన ఇద్దరు పిల్లలకూ అమెరికా పాస్‌పోర్టులు పొందడం ప్రభుత్వోద్యోగినిగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని శాఖాపరమైన దర్యాప్తులో తేలింది.