గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (17:26 IST)

తెరాస ఎంపీలకు షాకిచ్చిన రాజ్‌నాథ్ : చట్టం మేరకే గవర్నర్ పెత్తనం!

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్ అధికారులు విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ఉంటాయని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తనను కలిసిన తెరాస ఎంపీలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గవర్నర్‌ పెత్తనం వద్దంటూ గురువారం టీఆర్ఎస్ ఎంపీలు రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. 
 
ఈ భేటీలో సెక్షన్ 8లో ఉన్నటువంటి అభ్యంతరాలను టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి రాజ్‌నాథ్ దృష్టికి తీసుకువచ్చారు. సెక్షన్ 8లో ఉన్న అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్)కు సంబంధించిన అంశంలో గవర్నర్ స్వతంత్య్రంగా నిర్ణయం తీసుకోవడంపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఎంపీలు హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 
 
దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అధికారాలను మార్పులు చేసేదిలేదని, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలు అలాగే ఉంటాయని, తగ్గించబోమన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ అధికారాలు ఇవ్వడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదని.. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటుందని వారికి రాజ్‌నాథ్ సంగ్ హామీ ఇచ్చారు.