శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:53 IST)

ఆ కారణంతోనే అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించాం : 'హత్రాస్‌'పై సుప్రీంకు యూపీ నివేదిక!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఓ దళిత బాలికపై జరిగిన హత్యాచార ఘటనలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన యువతి పార్థివదేవాన్ని కనీసం తల్లిదండ్రులకు కూడా చూపించకుండా పోలీసులే అర్థరాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. అదీకూడా దహనం చేశారు. దీంతో ఈ కేసులో పోలీసులపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ పరిణామంపై సుప్రీంకోర్టుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తాము అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించింది. హత్రాస్‌లో దాడికి గురైన 19 ఏళ్ల అమ్మాయి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29వ తేదీన మృతి చెందింది. అయితే, ఆమె చికిత్స పొందిన సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నా తరహాలోనే మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని యూపీ సర్కారు సుప్రీంకు తెలిపింది.
 
నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ వ్యవహారానికి కులం, మతం అంశాలను ఆపాదించి కొన్ని స్వార్థపూరిత శక్తులు లాభపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని, ఇలాంటి విపరిణామాలు చోటుచేసుకోకుండా ఉండేందుకే తాము ఆ యువతి మృతదేహానికి అత్యవసరంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించింది. ముఖ్యంగా, యువతి మరణించిన మరుసటిరోజు భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ సర్కారు సమర్పించిన నివేదికలో పేర్కొంది.