ఢిల్లీలో ఆపరేషన్ ముక్తి... వేశ్యగృహం నుంచి పలువురికి విముక్తి.. ఆంధ్ర యువతికి కూడా
పలువురు యువతులను విడిపించడానికి ఢిల్లీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ దీన గాథ వెలుగుచూసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గౌతమబుద్ధ రోడ్లోని రెడ్లైట్ ఏరియాపై శుక్రవారం ఉదయం పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం కూపంలో చిక్కుకున్న పలువురు మహిళలకు విముక్తి కలిగించారు.
వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కూడా ఉంది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని తనను నమ్మబలికి ఇక్కడ అమ్మేసి వెళ్లిపోయారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. తనను ఇంటికి పంపించాలని ఓ మీడియా చానెల్కు చెప్పుకుని కన్నీరు మున్నీరు అయింది. దీంతో ఆ మహిళను స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు ఏపీ పోలీసులను సంప్రదించారు.