శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (17:12 IST)

అమ్మ కోసం జైలు ముందు పన్నీర్ పడిగాపులు.. రేపే జయ భవితవ్యం!

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒ. పన్నీర్ సెల్వం.. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా బెంగుళూరుకు వెళ్లిపోయి.. అమ్మ జయలలిత ఉన్న పరప్పణ అగ్రహారం జైలు బయట పడిగాపులు కాస్తున్నారు. అమ్మను బయటకు తీసుకొచ్చేంత వరకు బెంగుళూరు వీడేది లేదని ఆయన భీష్మించి కూర్చొన్నారు. అంతేకాకుండా, అమ్మ బెయిల్ పిటీషన్‌పై విచారించేందుకు దేశంలో ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పేరుమోసిన రాంజెఠ్మలానీని రంగంలోకి దించారు. ఆయనతో మంగళవారం జయలలిత పిటీషన్‌పై వాదనలను గట్టిగా వినిపించారు. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో జయలలితకు రూ.100 కోట్ల రూపాయల అపరాధం విధించడం అక్రమమంటూ జెఠ్మలానీ వాదించారు. ఈ అపరాధ విధింపే జయలలితకు బెయిల్ మంజూరు చేసేలా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే, జయలలిత బెయిల్ పిటీషన్, సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటీషన్లను అడ్మిట్ చేసుకున్న కర్ణాటక హైకోర్టు.. విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఆ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పన్నీర్ సెల్వం.. అమ్మ ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ పిటీషన్‌పై సత్వరం విచారణ చేపట్టాలని మొరపెట్టుకున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్నాడీఎంకే నేతల ప్రత్యేక విజ్ఞప్తితో జయలలిత బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఈ విషయంలో పన్నీర్ సెల్వం మాత్రం అమ్మను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేంత వరకు బెంగుళూరులోనే తిష్టవేసి కూర్చొన్నారు.