శశికళ సీఎం కాకుండా అడ్డుకోండి : ఒకే.. రేపు విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ఇప్పటికే, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో పాటు అక్రమాస్తుల కేసుపై వెలువ
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ఇప్పటికే, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో పాటు అక్రమాస్తుల కేసుపై వెలువడనున్న తీర్పు కారణంగా శశికళ సీఎం పీఠాన్ని అడుగు దూరంలో కోల్పోయిన సంగతి తెలిసిందే. పైగా, జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఆమెను సీఎం చేయాలా? వద్దా అన్న డైలమాలో ఉన్న రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు న్యాయ సలహా కోరారు.
ఈ వ్యవహారం ఇలావుండగానే శశికళకు తాజాగా మరో గట్టి దెబ్బ తగిలింది. సత్తా పంచాయత్ ఇయక్కమ్ అనే తమిళనాడుకు చెందిన సామాజిక సంస్థ ప్రతినిధులు శశికళను సీఎం చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశికళ నియామకాన్ని అడ్డుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రేపు ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో తీర్పు ఎక్కడ వ్యతిరేకంగా వస్తుందోనన్న ఆందోళనలో ఉన్న శశికళ వర్గానికి సుప్రీం కోర్టు తాజా నిర్ణయం షాకిచ్చింది.
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాలు ఎత్తుకు పై ఎత్తు వేసే దిశగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ తన వైపు ఉన్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్కు తరలించారు. వారింకా అక్కడే గడుపుతున్నారు. అయితే, ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించడం పట్ల ఓ సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఓ న్యాయస్థానంలో ఆయన పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.