బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (15:44 IST)

జయలలిత ఆస్తులను జాతికి అంకితం చేయాలి.. మద్రాస్ హైకోర్టులో పిల్.. వారసులు లేరట..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం చర్చ మొదలైంది. జయలలి ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం చర్చ మొదలైంది. జయలలి ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. 
 
డిసెంబర్‌ 5న మృతిచెందిన జయలలితకు వారసులెవరూ లేని కారణంగా జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యవహారం అంతా నిర్వహించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని పిటిషనర్ కోరారు. 
 
ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చుచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు జయ ఆస్తుల వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్‌ను కూడాపిటిషన్‌తో పాటు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.
 
కాగా గతంలో హైదరాబాద్‌లోని జయలలిత ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వారసులు లేనందున జయ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని గరీబ్ గైడ్ ఇంటర్నేషనల్ సంస్ద న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై విచారించిన కోర్టు జయలలిత సోదరుడు ఉండగా.. హిందూ చట్టం ప్రకారం వారసులు లేరని మీరెలా అంటారని పిటీషనర్‌ను ప్రశ్నించింది. 
 
ప్రచారం కోసమే పిటీషన్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో జయ ఆస్తులపై తమిళనాడు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని అన్నాడీఎంకే కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.