ప్రధాని ఉజ్వల యోజన పథకం ఆవిష్కరణ: 5కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (మే 1) ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని బాలియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ పాల్గొని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ప్రధాని చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న కార్మికులందరికీ వందనాలంటూ ప్రసంగం మొదలెట్టారు. కార్మికులంతా తరలిరండి.. ప్రపంచాన్ని ఐక్యం చేద్దామని కొత్త నినాదంతో మోడీ పిలుపునిచ్చారు.
బాలియా ప్రజలు తమ జీవితాన్ని దేశానికి అంకింతం చేశారు. గొప్ప పోరాటయోధుడైన మంగల్పాండేను బాలియా.. దేశానికిచ్చిందని గుర్తు చేశారు. పేదల కోసమే అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని మోడీ చెప్పారు. ఇదే విషయాన్ని పార్లమెంట్ సెంట్రల్హాల్లో తన మొదటి ప్రసంగంలోనే చెప్పాననే విషయాన్ని గుర్తు చేశారు.