బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (12:09 IST)

నరేంద్ర మోడీకి సన్నిహితుడిగా వెంకయ్య: ఐక్యతా పరుగు ప్రారంభం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రునిగా తెలుగు నేత వెంకయ్యనాయుడు మారారు. మోడీ కోర్ టీంలో ఉన్న కీలక మంత్రుల్లో వెంకయ్యనాయుడుకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటీవల, ప్రతీ కార్యక్రమంలో మోడీ వెంకయ్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. 
 
శుక్రవారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా విజయ్ చౌక్ నుంచి ప్రధాని ఐక్యతా పరుగును ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమంలో, మోడీ తర్వాత వెంకయ్యకు అధిక ప్రాధాన్యం లభించింది. ఈ కార్యక్రమానికి సుష్మా స్వరాజ్‌తో పాటు చాలా మంది కేబినెట్ మంత్రులు హాజరైనా మోడీ వెంకయ్యకే ఇంపార్టెన్స్ ఇచ్చి కార్యక్రమానికి సారథ్యం వహించాలని కోరారు. 
 
ఇటీవల కాలంలో ప్రధాని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, దానికి వెంకయ్యే సారథ్యం వహించాలని కోరుకుంటున్నారని సమాచారం. 
 
ఈ మధ్యనే, గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరైనప్పటికీ... మోడీ వెంకయ్యకే సారథ్య బాధ్యతలు అప్పచెప్పారు. 
 
అలాగే, ఇటీవల ప్రధాని నివాసంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో నిర్వహణ బాధ్యతలను వెంకయ్యకే అప్పగించారు. కేంద్ర కేబినెట్‌లో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుల అభిప్రాయాలకు మోడీ ఎక్కువ విలువను ఇస్తున్నారని పార్టీ శ్రేణుల సమాచారం.
 
అలాగే వెంకయ్య నాయుడు కూడా నరేంద్ర మోడీ బాటలోనే పయనిస్తున్నారు. దీపావళి పండుగను మోడీ కాశ్మీర్ వరద బాధితులతో జరుపుకుంటే.. వెంకయ్య నాయుడు విశాఖలోని వరద బాధితులతో గడిపిన సంగతి తెలిసిందే.