లఖ్వీకి బెయిలా.. ఫైర్ అవుతున్న భారత్.. పాక్ ప్రతిష్ట దిగజారుతోంది!
ముంబై మారణహోమం నిందితుడు, లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది రహ్మన్ లఖ్వీకు పాకిస్తాన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై భారతదేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లఖ్వీ లాంటి ఉగ్రవాదికి బెయిల్ రావడం విచారకరమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం వల్ల పాక్ ప్రతిష్ట మరింత దిగజారితుందని బీజేపీ అగ్రనేత అద్వానీ అభిప్రాయపడ్డారు. పెషావర్లో విద్యార్థులను హతమార్చిన సమయంలోనే లఖ్వీకి బెయిల్ ఇవ్వడంపై భారత అగ్ర నేతలు మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా గురువారం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్లో అంతే. ఈ తీర్పు పాకిస్తాన్ ప్రతిష్టను దిగజారుస్తుందని అన్నారు. వారి న్యాయవ్యవస్థపై నేనేమి మాట్లాడనని అద్వానీ చెప్పారు.
ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ పెషావర్లో చిన్నపిల్లలను ఉగ్రవాదులు చంపిన ఘటన ఇంకా మరిచిపోలేదని, దాన్ని ప్రపంచమంతా చూసిందని అన్నారు.
కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతం చేస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీప్ చెప్పారని... దాన్ని ప్రపంచమంతా స్వాగతించిందని... ఇప్పుడు ఉగ్రవాది రహ్మన్ లఖ్వీకు ఎలా బెయిల్ వచ్చిందని మండిపడ్డారు. లఖ్వీ, హఫీజ్ సయీద్తో కలిసి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడని జవదేకర్ ఆరోపించారు.