గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (12:44 IST)

#AtalBihariVajpayee 95వ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధాని

భారత మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్ పేయి 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. డిసెంబర్ 25న ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. ఢిల్లీలోని అటల్‌ సమాధి వద్దకు చేరుకుని అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
 
అలాగే ఈ దేశ ప్రజలు వాజ్ పేయికి ఘనంగా స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నారని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. వాజ్ పేయి చేసిన ప్రసంగాల తాలూకు మాంటేజీని కూడా అయన జత చేశారు. దివంగత ప్రధాని పేరిట మోదీ ప్రభుత్వం వివిధ ప్రజాసంక్షేమ పథకాలను చేబట్టింది. 
 
గ్రౌండ్ వాటర్ మేనేజ్ మెంట్‌ని మెరుగుపరచేందుకు ''అటల్ భూజల్ యోజన'' పేరిట రూ. 6 వేల కోట్ల పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే రోహ తాంగ్ కనుమ కింద కీలకమైన టన్నెల్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
 
కృష్ణదేవి, కృష్ణ బిహారీ వాజ్ పేయి దంపతులకు వాజ్ పేయి 1924 డిసెంబరు 25న జన్మించారు. 1939లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. 1942‌లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తన సోదరుడితో సహా ఆయన అరెస్టయ్యారు. ఆ సమయంలోనే భారతీయ జన సంఘ్‌కు నేతృత్వం వహించవలసిందిగా ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను కోరింది.

1962లో 37 ఏళ్ళ వయస్సులో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. అనంతరం లోక్‌సభ సభ్యుడై ఆ సభకు తొమ్మిది సార్లు ఎన్నికవుతూ వచ్చారు. 1996లో 13 రోజులు, 1998 లో 13 నెలలు, 1999 నుంచి ఐదేళ్లు ఆయన ప్రధానిగా వ్యవహరించారు.