ఇంకపై కుందేలు మాంసం తినొచ్చు... చట్టబద్ధంగా విక్రయాలు!
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది.
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆహార భద్రతా చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసింది.
వాస్తవానికి కేరళ, జమ్మూకాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలామంది కుందేలు, చెవుల పిల్లుల మాంసాన్ని ఆరగిస్తుంటారు. కేరళలో అయితే ఏకంగా 15 వేల కుటుంబాలు ఈ మాంసం కోసమే కుందేళ్ళను పెంచుతూ జీవిస్తున్నారు.
అయితే, దేశ వ్యాప్తంగా కుందేలు మాంసాన్ని తినడానికి ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతి లేదు. కేవలం గొర్రెలు, మేకలు, పందులు, గేదెలు, అడవిదున్న వంటి పశుమాంసాన్ని తినడానికే ఇది అనుమతిచ్చింది.
ఈ నేపథ్యంలో, కుందేలు మాంసాన్ని కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి జాబితాలో చేర్చాలని ప్రధానమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు వచ్చాయి. దీంతో, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాని తమను ఆదేశించారని, అందుకే కుందేలు మాంసాన్ని కూడా ఈ జాబితాలోని చేర్చినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వర్గాలు ప్రకటించాయి.