గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (17:13 IST)

రాహుల్‌కు కోపమొచ్చింది.. ఢిల్లీ అధికారులు బిత్తరపోయారు!!

రాహుల్ గాంధీకి కోపం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. దీంతో ఢిల్లీ మున్సిపల్ అధికారులు హడలిపోయారు. ఢిల్లీలోని మురికివాడల్లో ఉన్న గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన అధికారులకు ఆయన షాకిచ్చారు. గుడిసెలు తొలగించాలంటే ముందుగా తనపై నుంచి బుల్డోజర్లు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
ఢిల్లీ రంగ్ పురి పహాడీ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు అధికారులు దిగడం పట్ల రాహుల్ తీవ్రంగా స్పందించారు. మరోసారి ఆ ప్రాంతంలో ఆ ఇళ్లను కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, బుల్డోజర్లను తనపై ఎక్కించుకుని పోనివ్వాలని సవాల్ విసిరారు. పహాడీని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
పేదల తరపున పోరాడతానని అక్కడి వాసులకు హామీ ఇచ్చారు. 900 ఇళ్లను కూల్చగా వేలమంది నిరాశ్రయులయ్యారు. తక్షణమే ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చలికాలమని, కనీసం హెచ్చరికలు కూడా చేయకుండా, ఇళ్లు నేలమట్టం చేశారని రాహుల్ మండిపడ్డారు.