బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:05 IST)

అచ్ఛే దిన్ సర్కార్... అట్టర్ ఫ్లాప్ అయ్యింది : లోక్‌సభలో రాహుల్ ధ్వజం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన గళాన్ని విప్పారు. 57 రోజుల అజ్ఞాతవాసం తర్వాత ఇటీవలే హస్తినకు చేరుకున్న ఆయన... సోమవారం లోక్‌సభ వేదికగా తొలిసారి ప్రసంగించారు. భూసేకరణ బిల్లును ఆసరాగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అచ్ఛే దిన్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ (మంచి రోజుల సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది) అయ్యిందంటూ మండిపడ్డారు. 
 
ఇక్కడ దేశం ఉంది. కానీ అది మీది కాదు. కేవలం రాజకీయ సమీకరణాల కారణంగానే మోడీ ప్రధాని అయ్యారు. మీకు రాజకీయ సమీకరణాలు బాగా తెలుసు. నాకో సందేహం వస్తోంది. మీకు సమీకరణాలు బాగా తెలిసుంటే దేశంలోని 60 శాతం మంది రైతులకు కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తున్నారు? రక్షణ రంగం అంటారు, మిస్సైల్స్ అంటారు, యుద్ధ విమానాలు అంటారు. మరి రైతుల గోడు మీకెందుకు పట్టదు? భూమిపై ఆధారపడ్డ రైతుల కన్నా, ఆ భూమిని కావాలనుకుంటున్న కార్పొరేట్లకు మేలు చేకూర్చాలన్నదే మీ అభిమతమని నేను అనుకుంటున్నా అంటూ సుతిమెత్తని విమర్శలు గుప్పించారు. 
 
మోడీ సర్కారు ఎన్నో తప్పులను చేస్తోందని, వాటిని ఇంకెంతో కాలం సహిస్తూ ఊరుకునేది లేదని అన్నారు. దేశంలో రైతుల కారణంగానే హరిత విప్లవం విజయవంతమైందని గుర్తు చేసిన ఆయన, ఈ సీజన్‌లో కనీస మద్దతు ధర ప్రకటించడంలో కేంద్రం విఫలమైందన్నారు. రాహుల్ ప్రసంగానికి విపక్ష సభ్యుల నుంచి మంచి మద్దతు లభించగా, అడ్డుకునేందుకు ఎన్డీఏ సభ్యులు అడుగడుగునా ప్రయత్నించారు.