మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (09:56 IST)

తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా: రజనీకాంత్ ప్రకటన

తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడును చూస

తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడును చూసి నవ్వుకుంటున్నాయని అన్నారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాడిగా మిగిలిపోతానని చెప్పారు. తనకు తమిళ ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తెలిపారు. 
 
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. యుద్ధం చేయబోతున్నానని... గెలుపు, ఓటమి భగవంతుడి చేతిలోనే ఉందని తెలిపారు. తనకు రాజకీయాలంటే భయం లేదని, మీడియా అంటేనే భయమని చెప్పారు. 
 
రాజకీయాల్లో గెలిస్తే విజయమని... లేదంటే విరమణ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. కాలమే తన రాజకీయ ఆరంగేట్రాన్ని నిర్ణయించిందన్నారు. రజనీ ప్రకటనతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటప ప్రాంగణం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది.
 
రాజకీయాల్లోకి వచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రజనీకాంత్ తెలిపారు. ఎవర్నీ విమర్శించడం తమ అభిమతం కాదని, ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీకి మంచి కేడర్, వాచ్ డాగ్స్ కావాలని తెలిపారు. పార్టీకి సంబంధించిన కార్యాచరణను, విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఇకపై ప్రతి ఎన్నికలో తమ సైన్యం ఉంటుందని, అయితే త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు మాత్రం తమ పార్టీ దూరంగా ఉంటుందని... సమయం చాలా తక్కువ ఉండటంతో, పార్టీని సమాయత్తం చేయడం కష్టమవుతుందని తెలిపారు.