మోడీ - రాజ్నాథ్ల ప్రచ్ఛన్న యుద్ధం... అందుకే రాజీవ్ మెహ్రిషీ నియామకం!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుందా? అందుకే హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహ్రిషీని రాజ్నాథ్కు మాటమాత్రం చెప్పకుండా మోడీ నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్లో వసుంధరా రాజే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజీవ్, సంస్కరణల అమలులో ముందు నిలిచి మోడీ కోటరీలోకి చేరిపోయారు.
1978 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయనను గత సంవత్సరం అక్టోబరులో ఆర్థిక వ్యవహారాల విభాగానికి మోడీ తీసుకొచ్చారు. అరుణ్ జైట్లీకి కుడి భుజంగా నిలిపారు. ఆ శాఖలో సైతం రాజీవ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో హోం శాఖలోకి, అందునా రాజ్నాథ్కు ఇష్టం లేకుండానే రాజీవ్ ప్రవేశించడం, మంత్రిత్వ శాఖలో అస్థిరతకు దారితీయవచ్చని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు.
నిజానికి తనకు నమ్మకమైన వ్యక్తిని హోంశాఖ కార్యదర్శిగా నియమించుకోవాలని రాజ్నాథ్ గట్టిగా భావించారు. అయితే, చివరకు తనకు తెలియకుండానే కార్యదర్శిగా రాజీవ్ నియామకం జరిగిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.