గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (21:03 IST)

'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల.. రైళ్లకు నిప్పు.. 30 మంది మృతి (Video)

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను పంచనామా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఈ తీర్పుతో ఉత్తరాది రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లింది.

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను పంచనామా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఈ తీర్పుతో ఉత్తరాది రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లింది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణల్లో 31 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.
 
హర్యానాలోని పంచకులలో చిన్నారితో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించగానే గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ మద్దతుదారులు హింస, విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. మీడియా వాహనాలు, ప్రతినిధులపైనా ప్రతాపం చూపించారు. ఈ దాడులతో ఉత్తరాది రాష్ట్రాలోని పంజాబ్, హర్యానాలతో పాటు.. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు విలవిలలాడిపోయాయి. 
 
హర్యానాలో రెండు రైల్వే స్టేషన్లు, పవర్‌గ్రిడ్‌, పెట్రోల్‌ పంప్‌నకు నిప్పుపెట్టారు. ఢిల్లీలోనూ నిరసనకారులు విధ్వంసాలకు దిగారు. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో రైలు, రెండు బస్సులను దగ్ధం చేశారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో నిరసనకారులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పంచకులతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు.
 
హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో పాటు పలు జిల్లాల్లో 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. దేశ రాజధాని ఢిల్లిలోనూ భద్రతను పెంచారు. తమ రాష్ట్రానికి మరిన్ని బలగాలు పంపాలని కేంద్రాన్ని పంజాబ్‌ ప్రభుత్వం కోరింది. 
 
ఇప్పటికే పంజాబ్‌లో 75 కంపెనీల కేంద్ర బలగాలు, హరియాణాలో 35 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. పంజాబ్‌, హరియాణాలోని అనేక ప్రాంతాల్లో బస్సు సర్వీసులు రద్దు చేశారు. రెండు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. మొబైల్‌ ఇంటర్నెట్‌, డేటా సేవలను నిలిపివేశారు.