శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:39 IST)

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై అత్యాచార కేసు నమోదు

కొద్ది రోజులుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరఖాండ్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై ఎట్టికేలకు కేసు నమోదు అయ్యింది. మహిళ ఫిర్యాదు మేరకు ద్వారహత్ నుండి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై అత్యాచారం మరియు క్రిమినల్ బెదిరింపు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
 
నెహ్రు కాలనీ పోలీసు స్టేషనులో ఆదివారం మహేశ్ నేగిపై ఐపిసి సెక్షన్ 376(అత్యాచారం), 506(క్రిమినల్ బెదిరింపు)కింద స్థానిక కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరండెంట్ (సిటీ)శ్వేతా చౌబే తెలిపారు. మహేశ్ నేగి భార్య రీటా నేగిపై కూడా క్రిమినల్ బెదిరింపు కేసు నమోదైంది.
 
అయితే ఈ ఆరోపణలు తన పరువు తీసే కుట్రలో భాగంగానే వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. ఆ మహిళ తన నుండి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని, ఆ డబ్బు ఇవ్వని కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని తెలిపారు. ఏది ఏమైనా తాను దర్యాప్తుకు సిద్దంగా ఉన్నానని కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.
 
మహేశ్ నేగి తనను బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడని ఆయన కారణంగా పాపకు జన్మనిచ్చానని ఓ మహిళ ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవసరమనుకుంటే తన బిడ్డకు డిఎన్ఏ పరీక్ష చేసి నిజాన్ని బయటకు వెల్లడించాలని ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ఫిర్యాదుతో ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన పోలీసులు ఎమ్మెల్యే దంపతులపై కేసులు నమోదు చేశారు.