సన్మానం కంటే నా ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించండి...! గురుదాస్పూర్ సాహస డ్రైవర్..!!
బస్సులోని ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన సాహసోపేత గురుదాస్పూర్ డ్రైవర్ నానక్ చంద్ ఓ తాత్కాలిక ఉద్యోగి మాత్రమే.. తన జీతం నెలకు రూ. 5 వేలు. ప్రస్తుతం ఆయన తన ఉద్యోగాన్ని క్రమబద్దీకరించమని వేడుకుకుంటున్నాడు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల పంజాబ్లోని గురుదాస్పూర్లో ఉగ్రవాద దాడి సమయంలో సాహసం ప్రదర్శించి ధైర్యంగా 76 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్ తన ఉద్యోగం క్రమబద్ధీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గురుదాస్పూర్లో బస్సును ఉగ్రవాదులు అడ్డుకొని దాడి చేయడానికి ప్రయత్నించారు. 45 ఏళ్ల బస్సు డ్రైవర్ నానక్ చంద్ ధైర్యంగా బస్సును ఉగ్రవాదులు అడ్డుకుంటున్నా పట్టించుకోకుండా ముందుకు నడిపిన సంగతి తెలిసిందే. అప్పటికే బస్సుపై ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులు జరపడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
వారికి చికిత్స అందించడం కోసం బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆయన ధైర్యసాహసాలకు ప్రభుత్వం అభినందించింది.ఆయనను సన్మానించాలని నిర్ణయించింది. అయితే నానక్ చంద్ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ను కలిసి తన ఉద్యోగం పర్మినెంటు చేయాలని కోరారు.