మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (13:49 IST)

రిలయన్స్ పియో మద్యం : ముఖేష్ అంబానీకి ఓ మందు ప్రియుడి విన్నపం... నెట్‌లో హల్‌చల్

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఓ మందు ప్రియుడు చేసిన విన్నపం ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖేష్ అంబానీని మద్యం వ్యాపారంలోకి రావాల్సిందిగా మందుబాబులు కోరుతున్నట్లుగా పెట్టారు.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఓ మందు ప్రియుడు చేసిన విన్నపం ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖేష్ అంబానీని మద్యం వ్యాపారంలోకి రావాల్సిందిగా మందుబాబులు కోరుతున్నట్లుగా పెట్టారు. ఆయన స్థాపించే కంపెనీ తయారు చేసే మద్యానికి 'రిలయన్స్ పియో' అని పేరు పెట్టాలని సూచిస్తూ.. ఓ ఫోటో క్రియేట్ చేశారు. ఇది నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అంతేనా మందుబాబులకు మద్యం ఫ్రీగా ఇవ్వాలని, స్నాక్స్‌కు మాత్రమే ఛార్జ్ చేయాలని ఛలోక్తులు విసిరారు. 
 
అయితే, ఆ మందుప్రియుడు ఈ తరహా పోస్ట్ పెట్టడానికి కారణం లేకపోలేదు. రిలయన్స్ జియో టెలికామ్ రంగంలో ఓ పెను తుఫాను సృష్టించింది. ఓ సంచలనంగా మారింది. దేశ టెలికాం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు వేదికైంది. అతి తక్కువ కాల వ్యవధిలోనే కోట్లాది మంది మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకుంది. 
 
ఈ సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖేష్ అంబానీ చేసిన ప్రసంగం అప్పటివరకూ దిగ్గజాలుగా పేర్కొంటున్న కంపెనీలకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. ఈ షాక్ నుంచి తేరుకున్న మిగతా టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ప్రకటనతో తమ వినియోగదారులు ఎక్కడ చేజారిపోతారోనని ఆత్మరక్షణలో పడటమే కాకుండా, పోటీపడీమరీ ధరలు తగ్గించాయి. 
 
దీంతో వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు. ఏదేమైనా టెలికాం కంపెనీల మధ్య మొదలైన వార్ కస్టమర్లకు మాత్రం ఎంతో మేలు చేస్తోంది. దీంతో రిలయన్స్ జియో సిమ్ దొరక్కపోయినా ముఖేష్ అంబానీ మిగతా టెలికాం కంపెనీల వినియోగదారులకు దేవుడిలా కనిపిస్తున్నారు. ఇదీ ఈ పోస్ట్ వెనకున్న అసలు సంగతి.